పత్రికా ప్రకటన ఏప్రిల్ 25, తిరుపతి, 2019
ఏప్రిల్ 26న ”భక్తులతో భవదీయుడు ”
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఏప్రిల్ 26వ తేదీన ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమం జరుగనుంది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. భక్తులు ఫోన్ ద్వారా నేరుగా జెఈవో గారికి సూచనలు, సలహాలు అందించవచ్చు. ప్రతినెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం జరుగనుంది. ఐతే, ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో ఈ నెల మూడో శుక్రవారం బదులు నాలుగో శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు : 0877-2234777.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం తదితర టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, సత్రాల్లో సౌకర్యాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడమైనది. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశముంటుంది. —————————————————————-
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
పత్రికా ప్రకటన తిరుపతి, 2019 ఏప్రిల్ 25
రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా సనాతన ధర్మ ప్రచారం
టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
భారతీయ సనాతన ధర్మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రాబోవు 6 నెలలో ప్రతి గ్రామ పంచాయతీలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులొ భాగంగా ప్రతి గ్రామంలో అంకిత భావం, ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రచారకులను గుర్తించాలన్నారు. టిటిడి, ఎస్వీబీసి, హెచ్డిపిపి వెబ్సైట్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ధాలన్నారు.ఇందులో భక్తులకు అవసరమైన సమాచారం, కార్యక్రమాల వివరాలను రూపొందించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. హెచ్డిపిపి వెబ్సైట్ను లక్షలాది మంది వీక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో స్త్రోత్రాలు, వ్రతాలు, పండుగలు – వాటి ప్రాముఖ్యత, పండుగలు జరుపుకొను విధి-విదానాలు, తదితర అంశాలతో డాక్యుమెంటరీ రూపొందించి ప్రసారం చేయాలన్నారు. తద్వారా భక్తులు సులభంగా పండుగలను జరుపుకుంటారని తెలిపారు.ఎస్వీబీసి స్టూడియో నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత ఉన్న ఆస్థాన మండపంలోని సెల్లార్లోని పాత అన్నప్రసాద భవనంలో భక్తులకు అవసరమైన లగేజి, పాదరక్షలు, సెల్ఫోన్ కౌంటర్లు, స్కానింగ్ సెంటర్లు, వేచి ఉండే గదులు, మరుగుదొడ్ల వసతి, టికెట్ కౌంటర్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్రైడే గార్డెన్స్లో ఆలయ స్థలపురాణం, అమ్మవారి పుట్టుక, శ్రీ పద్మావతి పరిణయం, శ్రీనివాసుడి కల్యాణంను తెలిపేలా రూపొందిస్తున్న ఆగ్మెంటేషన్ రియాలటీ టెక్నాలజీ షో పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వద్ద మరింత పచ్చదనం పెంపొందించాలన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అద్దాల మహాల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
టిటిడి విద్యాసంస్థల వసతి గదులు, టిటిడి ఉద్యోగుల క్వార్టర్స్లలో మరమత్తు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. టిటిడి వసతి సమూదాయాలలో భక్తుల రాక పోక సమయాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
మే 4వ తేదీన టిటిడి విద్యాసంస్థలను, ఎస్వీ ఆయుర్వేద కళాశాలను పరిశీలించేందుకు ఐఎస్వో బృందం వస్తుందని, సంస్థల పురోగతికి వారి సూచనలకు అనుగుణంగా తీర్చిదిద్ధాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాలలో అగ్నిప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి వద్ద ఉన్న గరుడ విగ్రహం వద్ద మరింత ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో శ్వేతా డైరెక్టర్ శ్రీ ముక్తేశ్వరరావు, టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఇలు శ్రీ రమేష్రెడ్డి, శ్రీ రాములు, శ్రీ వెంకటేశ్వర్లు, ఇతర అదికారులు పాల్గొన్నారు. ——————————————————————-
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.