30-October-2018-NewsClips
మంగళవారం, అక్టోబర్ 30, 2018
జిల్లాలో 1.30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
మంత్రి ఉమామహేశ్వరరావు వెల్లడి
మైలవరం, న్యూస్టుడే: నవంబరు 9న 1.30 లక్షల నివేశన స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మైలవరం ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో సోమవారం కలెక్టర్ లక్ష్మికాంతం అధ్యక్షతన నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు రూ.7 వేల కోట్ల విలువైన స్థల పట్టాలను పంచుతున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి వెళ్లి ఫిర్యాదులు చేసేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో నిర్వహించామన్నారు. 80 ఎకరాల్లో పేదలకు నివేశన స్థలాలను మంజూరు చేసి, పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో గ్రామాల్లోనూ పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. నవంబరు 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మైలవరంలో 132 కేవీ, చంద్రాలలో 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ చుక్కల భూమి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. దాదాపు జిల్లాలోనే 70 వేల నుంచి 80 వేల ఎకరాల వరకు రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అర్జీల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని కోరారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు పత్రాలను మంత్రి, కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జేసీ- 2 బాబూరావు, సీఈవో షేక్ సలాం, డీఈవో రాజ్యలక్షి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో మరో ఆరు ఇసుక రేవులకు ప్రతిపాదన
విజయవాడ సబ్కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో మరో ఆరు ఇసుక రేవుల ఏర్పాటుకు ప్రతిపాదించామని, ఇందుకు సంబంధించిన పనులను చేపట్టాలని గనుల శాఖ అధికారులకు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 14 ఇసుక రేవులు ఉన్నాయని, ఇసుకకు ఉన్న డిమాండ్ కారణంగా రేవుల సంఖ్యను 20కు పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే, కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నగరంలోని తమ విడిది కార్యాలయం నుంచి జిల్లాలోని మండల, డివిజను అధికారులతో సోమవారం సాయంత్రం దూర, దృశ్య శ్రవణ సదస్సు (వీసీ) నిర్వహించారు. జిల్లాలోని ఛైల్డ్ కేర్ సంస్థలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. బోగస్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రజా సంతృప్తి స్థాయి విషయంలో జిల్లాకు సముచిత స్థానం వచ్చిందని పేర్కొంటూ, ఇంకా ఏఏ అంశాల్లో వెనుకబడి ఉందో అధికారులకు కలెక్టర్ వివరించారు. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ విభాగంలో 88 శాతంతో పెనమలూరు తహసీల్దారు మొదటి స్థానంలోనూ, 60 శాతంతో నాగాయలంక తహసీల్దారు చివరి స్థానంలో నిలిచారని కలెక్టర్ అభినందించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు భూముల కొనుగోలు పథకానికి సంబంధించి 500 ఎకరాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శివారు గ్రామాల నుంచి పీఆర్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులకు అనుసంధాన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఈనెల 31 నుంచి నవంబరు 24వ తేదీ వరకూ వరుసగా నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించి, పలు సూచనలు చేశారు. వీసీలో జేసీ-2 పి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రమంతా జిల్లా పేరే
కృష్ణా జిల్లా పేరు రోజూ వినిపించేలా పలువురు సామాజిక మాధ్యమంలో పోస్టింగులు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో కలెక్టర్ల సదస్సు తర్వాత నుంచి ఇప్పటి వరకూ 12,129 మంది వీక్షించినట్లు తెలిపారు. పోస్టింగులు చేసిన వారిలో అమూల్య పరికాల, హర్షా కింగు, కె.సుధాకర్బాబు, చిన్ని చౌదరి తదితరులున్నట్లు పేర్కొన్నారు.
‘రంగోలి’ విజయవంతం చేయండి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వేదికగా మంగళవారం నిర్వహించనున్న రంగోలి కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీకాంతం సోమవారం పరిశీలించారు. ఇందులో పాల్గొనే విద్యార్థులకు రంగవల్లిని ఏర్పాటు చేసే క్రమంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అధికారులకు సూచించారు. వీఆర్వోలు అందరూ పనిని విభజించుకొని సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. యువతతో పాటు స్థానికంగా ఆసక్తి ఉన్న విద్యార్థులను సంగమ ప్రాంతానికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం రంగులతో కలపిన ఉప్పును పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, తహసీల్దారు శివయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్త కార్డులొచ్చాయోచ్..!
రెండు జిల్లాలకు 67 వేలు మంజూరు
7.66 లక్షల కార్డుల మార్పునకు అనుమతి
సత్తెనపల్లి, న్యూస్టుడే : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతోపాటు.., అనేక అభివృద్ధి..సంక్షేమ పథకాల ప్రయోజనాల్ని కల్పించేందుకు రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఎన్టీఆర్ వైద్యసేవతోపాటు అన్ని పథకాలు వాటితోనే ముడిపడి ఉండటంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. రాజధానిలో అర్హులైన వారందరికీ వాటిని అందజేసే చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది.
* అమరావతి జిల్లాలైన గుంటూరు కృష్ణాలకు నూతనంగా 67 వేల కార్డులు మంజూరయ్యాయి. వివిధ కార్యక్రమాల కింద గతంలో మంజూరు చేసిన తాత్కాలిక కార్డులను శాశ్వత కార్డులుగా మార్చే చర్యలు చేపట్టారు.
* గుంటూరు జిల్లాలో 14,61,309, కృష్ణాలో 12,61,597 తెల్ల కార్డులు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. రచ్చబండ, జన్మభూమి మాఊరు కార్యక్రమాల కింద (ఆర్ఏపీ, జేఏపీ, టీఏపీ కార్డులు) గుంటూరు జిల్లాలో 4,09,186లు, కృష్ణాలో 3,56,958ల కార్డులను మంజూరు చేశారు. ఇవి ప్రస్తుతం తాత్కాలిక కార్డులుగా ఉన్నాయి. వీటిని శాశ్వత కార్డులుగా మార్చేందుకు ప్రస్తుతం అనుమతి ఇవ్వగా వాటి ముద్రణ ప్రక్రియ జరుగుతోంది.
* కృష్ణా జిల్లాకు 37 వేలు, గుంటూరు జిల్లాకు 30,500 తెల్ల కార్డులు తాజాగా మంజూరయ్యాయి. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ)లో వివరాలు నమోదుచేసి అక్కడి నుంచి కార్డులను డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. వీటిని వచ్చే నెలలో పంపిణీ చేయబోతున్నారు. గుంటూరు నగరానికి 8700లు, విజయవాడకు 9,500ల కార్డులు మంజూరయ్యాయి. ఎంతోకాలంగా వాటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు అవి త్వరలోనే చేతికి అందబోతున్నాయి.
మిగిలింది 2 రోజులే
పూర్తికావొస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు
మరికొన్ని చోట్ల స్థలలేమితో నిలిచిన నిర్మాణాలు
రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న జిల్లా
తిరువూరు, న్యూస్టుడే
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, చెత్త నుంచి తయారు చేసిన సంపదతో సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించాలనే సమున్నత ఆశయంతో ప్రభుత్వం వీటి నిర్మాణం చేపట్టింది. గత ఏడాది వీటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం ఈ ఏడాది అన్ని పంచాయతీల్లో చేపట్టాలని ఆదేశించింది. గతంలో చేపట్టిన పంచాయతీలను మినహాయించి మిగిలిన అన్ని గ్రామాల్లో వీటి నిర్మాణాన్ని ప్రారంభించారు.
వేగంగా కేంద్రాల నిర్మాణం
జిల్లాలోని 970కు 898 పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 836 కేంద్రాల నిర్మాణం పూర్తి చేయగా 39 పురోగతిలో ఉన్నాయి. వీటిలో 70 శాతం నిర్మాణాలు పూర్తి చేయగా, కొన్ని తుది దశకు చేరుకున్నాయి.
* ఒక్కో కేంద్రం నిర్మాణానికి జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటూ రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వీటి నిర్మాణ పనులను గతంలో పంచాయతీలకు అప్పగించగా ప్రస్తుతం ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
* బంటుమిల్లి, చందర్లపాడు, గుడివాడ, ఇబ్రహీంపట్నం, కైకలూరు, కలిదిండి, కంచికచర్ల, కంకిపాడు, కృత్తివెన్ను, ఉంగుటూరు, వత్సవాయి, వీరులపాడు, ముసునూరు, నాగాయలంక, పమిడిముక్కల, పెనమలూరు, ఉయ్యూరు మండలాల్లో కొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేసిన కేంద్రాలు, పురోగతిలో ఉన్న వాటిని కలుపుకొంటే 875 పనులను మినహాయిస్తే మరో 23 చేపట్టాల్సి ఉంది.
ముంగిట గడువు
* గడువు మాత్రం రెండు రోజులే ఉండగా కనీసం వీటి నిర్మాణం ప్రారంభించడానికి కొన్ని పంచాయతీల్లో స్థలాల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో వీటిని నిర్మించాల్సి ఉండటంతో స్థలసేకరణకు అవరోధంగా మారింది. స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నా ఫలితం లేకపోయింది. ఫలితంగా కొన్ని చోట్ల నిర్మాణాలు నిలిచాయి.
* పమిడిముక్కల మండలంలో 4, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ఒక్కొక్కటి, నాగాయలంక, విజయవాడ రూరల్లో మూడు చొప్పున నిర్మించడానికి ఆటకం ఏర్పడింది. *ఈనెలాఖరు లోపు ఇక్కడ ప్రారంభించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈనెల 31 లోపు పూర్తి చేయాలని గడువు విధించింది. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న జిల్లాలో నూరు శాతం పూర్తి చేసి వచ్చే నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్యాన్ని అధిగమించాలంటే వీటి నిర్మాణానికి అవసరమైన స్థలాలను కొనుగోలు చేయాల్సి ఉంది.
వేతనదారులకు ఉపాధి
కేంద్రం నిర్మాణం అంచనా మొత్తం పరిగణనలోకి తీసుకుంటూ వేతనదారులకు పనిదినాలు కల్పిస్తున్నారు. గుంతలు తీయడం, నీటి క్యూరింగ్ పనుల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. మిగిలిన మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరు చేస్తున్నారు. గతంలో వేతనదారుల పనిదినాలు అధికంగా ఉండగా మెటీరియల్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో కొన్నిచోట్ల వీటి నిర్మాణానికి పంచాయతీలు ముందుకు రాలేదు. పంచాయతీల్లోని చెత్తను ఇంటింటికి వెళ్లి సేకరించడం, వానపాముల ఎరువు తయారు చేసి తిరిగి రైతులకే అందించడానికి వీలుండటంతో వీటి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వేతనదారుల పని దినాలను కుదిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 70 పంచాయతీల్లో వీటి నిర్మాణం చేపట్టేందుకు ఆపసోపాలు పడిన అధికారులు ఈ ఏడాది లక్ష్యం ఎక్కువగా ఉన్నా అధిగమించడానికి చేరువయ్యారు.
బందరులో బయో మైనింగ్ ప్లాంట్
రూ.10కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన మహీంద్రా సంస్థ
కార్యాచరణపై సమీక్ష నిర్వహించిన మంత్రి రవీంద్ర
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్టుడే: జిల్లా కేంద్రమైన మచిలీపట్నం(బందరు)లో ఇబ్బందికరంగా ఉన్న చెత్త సమస్యకు మోక్షం లభించనుంది. సుదీర్ఘకాలంగా పట్టణానికి సమస్యగా ఉన్న డంపిగ్యార్డ్ ప్రక్షాళన విషయంలో కీలక అడుగులకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో పరిశుభ్ర వాతావరణం పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా స్వచ్ఛాంధ్ర మిషన్ మచిలీపట్నంపై దృష్టి సారించింది.రూ.10 కోట్ల అంచనాతో పట్టణంలో బయో మైనింగ్(చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం) ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ముందుకు వచ్చింది. ప్రతి రోజూ పట్టణం నుంచి వెలువడే రమారమి 80 టన్నుల చెత్తను నిల్వచేయడం పురపాలక సంఘానికి తలనొప్పిగా మారింది. రోజూ వచ్చే టన్నుల కొద్ది చెత్తను నిల్వచేసేందుకు ఆంధ్రా జాతీయ కళాశాల సమీపంలోని డంపిగ్యార్డ్లో సరిపడు స్థలం లేదు. దీంతో అక్కడ చెత్త కొండలా పేరుకుపోవడం, దాన్ని నిర్మూలించే క్రమంలో తగలబెడుతున్న చర్యలతో పరిసర ప్రాంతాలు వాతావరణ కాలుష్య కాసారాలుగా మారడం పరిపాటైంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సీఎల్ వెంకట్రావు, స్వచ్ఛాంధ్ర] మిషన్ అధికారులు పట్టణంలోని డంపిగ్యార్డ్ను సందర్శించిన విషయం తెలిసిందే. పరిస్థితిని గమనించి పట్టణంలో బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటుకు చొరవ తీసుకోవడంతోపాటు అవసరాన్ని బట్టి స్వచ్ఛాంధ్ర] మిషన్ నుంచి రూ.2 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్లాంట్ ఏర్పాటు విషయమై స్థానిక రహదారులు, భవనాల శాఖ అతిథిగృహంలో సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర, సీఎల్ వెంకట్రావులు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ బయోప్లాంట్ ద్వారా పట్టణం నుంచి వెలువడే చెత్తను పూర్తిగా నిర్మూలించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామన్నారు. కొండలా పేరుకు పోయిన చెత్తతో ఉన్న డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు. అందులో భాగంగానే స్వచ్ఛాంద్ర మిషన్ సహకారంతో బయో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
చెత్తపరంగా ఆదాయం
పట్టణం నుంచి రోజు వారీ వచ్చే చెత్తనుంచి తడి, పొడి చెత్తను వేరుచేయడంతో పాటు ప్లాస్టిక్, గాజు, ఐరన్ వంటి వ్యర్థాలను వేరుచేసి వాటి ద్వారా గ్యాస్, కంపోస్ట్లను తయారు చేసేలా చర్యలు తీసుకుంటారనీ, ఫలితంగా చెత్త సమస్య పూర్తిగా తొలగిపోవడంతో పాటు పురపాలక సంఘానికి చెత్త పరంగా ఆదాయం కూడా సమకూరుతుంతని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ముందుకు రావడంతో అవసరమైన స్థలం గుర్తించి త్వరలో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎల్ వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ వల్ల స్వచ్ఛతా కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. కూరగాయలు, పండ్ల వ్యర్ధాలు, హోటల్స్, చేపల మార్కెట్, కబేళాల నుంచి వచ్చే వ్యర్థాలు, తదితరాలను బయో మైనింగ్ పక్రియ ద్వారా కంపోస్ట్గా తయారు చేస్తారని తెలిపారు. బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయనీ, తగిన స్థలాన్ని సమకూర్చిన వెంటనే ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుతో పట్టణానికి చెత్త, దుర్వాసన వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎం. బాబాప్రసాద్, వైస్ ఛైర్మన్ కాశీవిశ్వనాధం, కమిషనర్ సంపత్కుమార్, స్వచ్ఛాంద్ర మిషన్ అధికారులు, ఏఎంసీ ఛైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు పల్లపాటి సుబ్రహ్మణ్యం, కొట్టె వెంకట్రావు, బత్తిన దాస్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.