Maha SivaRathri : 04-March-2019
శివుడు చెప్పిన శివరాత్రి కథ
శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాదికాలు జరపటం ఈ పండుగ నాడు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతికోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా? అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగపురాణంలో ఓ చక్కటి కథ ఉంది.
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం.. సాయంకాలానికి ఏదోఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించటం ఆయన దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయకు చీకటిపడే వేళైనా ఒక్క జంతువూ దొరకలేదు. దాంతో ఆయన నిరాశగా ఇంటిముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని.. అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తనకంటి చూపునకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కిందపడవేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ.. ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు.
రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయ. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని.. తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం.. పైగా అది మానవభాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండోజాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృశించి ఉన్నానని.. పైగా బక్కచిక్కిన తన శరీరమాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయ ఆశ్చర్యపోయాడు. మూడోజాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువూ దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగోజాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది.
బోయ తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక.. దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలూ బోయవాడికిచ్చిన మాటప్రకారం సత్యనిష్ఠతో వాడిముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్సవర్తన బోయబాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టుకావటం, అతడు తెలియకుండానే శివ శివా అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం.. తన చూపునకు అడ్డంవచ్చిన మారేడు దళాలను కోసి కిందపడవేయటం చేశాడు బోయవాడు. ఆ చెట్టుకిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజాఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకూ మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది.
క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠ అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్ఠతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలంపాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణమూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించినవారు, సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది.
మన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఇది మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి మరీ ప్రీతికరమైంది. ఆ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణచతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు. శివరాత్రులు అయిదు రకాలు. అవి.. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. నిత్యశివరాత్రి అంటే ప్రతిరోజూ రాత్రిపూటచేసే శివారాధన. పక్ష శివరాత్రి అంటే ప్రతి పదిహేను రోజులకొకసారి శివార్చన కోసం నిర్దేశించిన రాత్రి. మాసశివరాత్రి అంటే ప్రతి మాసంలోనూ శివపూజకు ఉద్దేశించిన రాత్రి. మిగతా శివరాత్రులు ఏవి కుదిరినా కుదరకపోయినా ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రినాడు శివపూజ చేయడం పుణ్యప్రదం. యోగి అయినవాడు తన యోగబలం చేత యోగనిద్రలోకి వెళ్లే రాత్రిని యోగశివరాత్రి అని అంటారు. సాధారణంగా రాత్రిపూట దేవీపూజను, పగటిపూట దేవపూజను చేయడం ఒక ఆచారంగా ఉంటుంది. కానీ శివరాత్రి విషయంలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున రాత్రిపూటే శివపూజ జరుగుతుంది. త్రిమూర్తులలో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఇలా శివ ఆరాధన రాత్రిపూట జరగడానికి ఓ కారణం కూడా ఉంది. పూర్వం ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది. ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. శివరాత్రినాడు శివుడిని రాత్రిపూట మాత్రమే పూజించడం, మిగిలిన పండుగలలా పంచభక్ష్య పరమాన్నాలతో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఓ విశేషం. మహాశివరాత్రి వ్రతాచరణను గురించి లింగపురాణం పేర్కొంటోంది. వ్రత ఉద్యాపన గురించి స్కందపురాణంలో వివరంగా ఉంది. శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం, రాత్రిపూట లింగార్చన, జాగరణం చేస్తారు. లింగార్చన తరువాత పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేయడం కూడా ఓ అలవాటుగా వస్తోంది. శివరాత్రినాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాలలో కూడా కొన్ని పద్ధతులున్నాయి. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాములలోనూ నాలుగు సార్లు నాలుగు రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు. మొదటి జాములో పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెడతారు. రుగ్వేద మంత్ర పఠనం జరుపుతారు. రెండో జాములో పెరుగుతో అభిషేకం, తులసీ దళార్చనచేసి, పాయసం నైవేద్యంపెట్టి యజుర్వేద మంత్రాలను చదువుతారు. మూడోజాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, నువ్వుల పొడి కలిపిన తిను బండారాలను నివేదిస్తారు. సామవేద మంత్రపఠన చేస్తారు. నాలుగో జాములో తేనెతో అభిషేకంచేసి నల్ల కలువలతో పూజించి అన్నం నివేదిస్తారు. అధర్వణ వేద మంత్రాలను చదువుతారు. ఇలా అభిషేకాలు చేసే శక్తిలేనివారు అభిషేకం చేసేటప్పుడు శివదర్శనం చేసుకున్నా పుణ్యమేనంటారు. నాలుగో జాము ముగిశాక ఉదయంపూట శివుడిని ఊరేగిస్తారు. ఇలా ఊరేగించడం వెనుక ఓ సామాజిక అంతరార్థం ఉంది. ఎవరైనా ఏ కారణం చేతనైనా ఆలయాలకు వెళ్ళి శివదర్శనం చేసుకోలేకపోతే వారికి ఆ ఊరేగింపును చూసి పుణ్యం పొందే భాగ్యం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రినాడు విధిగా చేస్తుంటారు. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్ళు శివలింగం మీద పోసి మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగంమీద పెడితే బోళాశంకరుడు పరవశించి అలా చేసినవారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో కనిపిస్తున్నాయి.
About Maha Sivarathri
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|