Pethai-Cyclone-Lossess-Central-Committee-Visit
జిల్లాకు కేంద్ర బృందంపెథాయ్ తుపాను నష్టం వివరాల పరిశీలన
కలెక్టర్ లక్ష్మీకాంతం
విజయవాడ సబ్కలెక్టరేట్, గొడుగుపేట, న్యూస్టుడే: జిల్లాలో పెథాయ్ తుపాను నష్టం వివరాల పరిశీలనకు కేంద్ర ప్రతినిధుల బృందం ఈనెల 31న పర్యటించనున్నట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈ క్రమంలో నష్టం వివరాలను తెలిపేందుకు ఆయా శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. నగరంలోని తమ విడిది కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉయ్యూరు, పెడన, మొవ్వ మండలాల్లో వ్యవసాయం, ఉద్యాన, విద్యుత్తు, ఆర్ అండ్ బి రహదారులు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. విజయవాడ నుంచి బయల్దేరే బృందం తొలుత ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో దెబ్బతిన్న అరటి క్షేత్రాలను పరిశీలిస్తారని తెలిపారు. మొవ్వ, గూడూరు ప్రాంతాల్లో రంగు మారిన ధాన్యం తదితరాలను పరిశీలిస్తారని వివరించారు. రైతులతో నేరుగా మాట్లాడతారని, ఈసందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒక బస్సులో బృందంతో పర్యటించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ విజయకృష్ణన్, జేసీ-2 పి.బాబూరావు, విజయవాడ ఉపకలెక్టర్ మిషాసింగ్, డీఆర్వో లావణ్యవేణి, గుడివాడ ఆర్డీవో సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.